శ్రీ శ్రీ గుర్వాతకం
శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రచించిన గురుదేవుల వైభవాన్ని వర్ణించే అద్భుతమైన స్తోత్రం.
కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలతో.
శ్లోకం 1
సంసార-దావానల-లీఢ-లోక / త్రాణాయ కారుణ్య-ఘనాఘనత్వమ్ । ప్రాప్తస్య కల్యాణ-గుణార్ణవస్య / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: సంసారమనే కార్చిచ్చులో కాలిపోతున్న జీవులను అగ్ని నుండి రక్షించడానికి దయామయుడైన మేఘము వలె ఉన్న, కళ్యాణ గుణాలకు సముద్రుడైన శ్రీ గురుదేవుని పాద పద్మములకు నేను వందనము చేయుచున్నాను.
శ్లోకం 2
మహాప్రభోః కీర్తన-నృత్య-గీత / వాదిత్ర-మాద్యన్-మనసో రసేన । రోమాంచ-కంపాశ్రు-తరంగ-భాజో / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క సంకీర్తనలో నృత్యము, గానము, మరియు వాద్యములచే కృష్ణ-ప్రేమ రసములో మునిగిపోయి, శరీరములో పులకరింత, వణుకు, మరియు ఆనందబాష్పముల తరంగములను పొందే శ్రీ గురుదేవుని పాద పద్మములకు నేను వందనము చేయుచున్నాను.
శ్లోకం 3
శ్రీ-విగ్రహారాధన-నిత్య-నానా / శృంగార-తన్-మందిర-మార్జనాదౌ । యుక్తస్య భక్తాంశ్ చ నియుంజతోఽపి / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: శ్రీ శ్రీ రాధాకృష్ణుల అర్చావిగ్రహ ఆరాధనలో, వారికి ఎన్నో రకాల శృంగార అలంకరణలు చేయుటలో మరియు మందిరాన్ని శుభ్రపరచుట మొదలైన సేవల్లో ఎప్పుడూ లీనమై ఉంటూ, తన శిష్యులను కూడా ఆ సేవలలో నిమగ్నం చేసే గురుదేవుల పాద పద్మములకు నేను వందనము చేయుచున్నాను.
శ్లోకం 4
చతుర్-విధ-శ్రీ-భగవత్-ప్రసాద / స్వాద్వ్-అన్న-తృప్తాన్ హరి-భక్త-సంఘాన్ । కృత్వైవ తృప్తిం భజతః సదైవ / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: భగవంతునికి నైవేద్యం చేసిన నాలుగు రకాల రుచికరమైన ప్రసాదాలను భక్తులకు పంచి వారిని తృప్తిపరచి, ఆ భక్తుల తృప్తిని చూసి తాము కూడా సదా సంతృప్తి చెందే గురుదేవుల పాద పద్మములకు నేను నమస్కరిస్తున్నాను.
శ్లోకం 5
శ్రీ-రాధికా-మాధవయోర్ అపార / మాధుర్య-లీలా గుణ-రూప-నామ్నామ్ । ప్రతి-క్షణస్వాదన-లోలుపస్య / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: శ్రీ శ్రీ రాధా మాధవుల అపరిమితమైన మాధుర్య లీలలను, వారి అనంతమైన దివ్య గుణ, రూప మరియు నామములను ప్రతిక్షణము ఆస్వాదించడానికి ఎంతో ఆసక్తి చూపే గురుదేవుల పాద పద్మములకు నా వందనాలు.
శ్లోకం 6
నికుంజ-యూనో రతి-కేలి-సిద్ధ్యై / యా యాలిభిర్ యుక్తిర్ అపేక్షణీయా । తత్రాతి-దాక్ష్యాద్ అతి-వల్లభస్య / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: బృందావన নিকుంజాలలో రాధాకృష్ణుల ప్రేమ లీలలకు సహకరించే గోపికల యొక్క ప్రణాళికలలో వారికి అత్యంత నైపుణ్యంతో సహాయం చేసేవారు, తద్వారా రాధాకృష్ణులకు అత్యంత ప్రియమైనవారు అయిన శ్రీ గురుదేవుని పాద పద్మములకు నేను అనునిత్యం వందనం చేస్తాను.
శ్లోకం 7
సాక్షాద్-ధరిత్వేన సమస్త-శాస్త్రైర్ / ఉక్తస్ తథా భావ్యత ఏవ సద్భిః । కింతు ప్రభోర్ యః ప్రియ ఏవ తస్య / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: సమస్త శాస్త్రాలచే గురువు సాక్షాత్తూ శ్రీహరితో సమానంగా చెప్పబడ్డాడు, మరియు మహానుభావులందరూ అలాగే భావిస్తారు. ఎందుకంటే గురువు భగవంతునికి అత్యంత ప్రియమైన సేవకుడు. అటువంటి శ్రీ గురుదేవుని పాద పద్మములకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
శ్లోకం 8
యస్య ప్రసాదాద్ భగవత్-ప్రసాదో / యస్యాప్రసాదాన్ న గతిః కుతోఽపి । ధ్యాయన్ స్తువన్స్ తస్య యశస్ త్రి-సంధ్యమ్ / వందే గురోః శ్రీ-చరణారవిందమ్ ॥
భావం: ఏ గురుదేవుని అనుగ్రహం వలన భగవంతుని కృప లభిస్తుందో, ఎవరి దయ లేనిదే జీవునికి ఎక్కడా ఎటువంటి ఆశ్రయం లేదా మోక్షం లభించదో, ఆ శ్రీ గురుదేవుల కీర్తిని ప్రతిరోజూ మూడు పూటలా (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) ధ్యానిస్తూ వారి దివ్య పాద పద్మములకు నేను ప్రణామము చేయుచున్నాను.



